హైదరాబాద్ : జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో మంచిర్యాల విద్యార్థికి చోటు లభించింది. మల్కపల్లి ఆశ్రమ స్కూల్ విద్యార్థి జమ్మిడి అంజన్న ప్రదర్శించిన ఫీడింగ్ ఛాంబర్ ప్రాజెక్ట్కు జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు పేటెంట్ దక్కే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జి డీఈవో పాణి.. అంజన్నను అభినందించారు.
2019- 20 విద్యాసంవత్సరానికి గానూ నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీల్లో తెలంగాణ నుంచి 33 మంది విద్యార్థులు పాల్గొనగా, అన్ని రాష్ట్రాల నుండి 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఆన్లైన్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ మధ్యలో నిర్వహించారు. ఈ పోటీల్లో కాసిపేట మండలం మల్కపల్లి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జమ్మిడి అంజన్న ప్రదర్శించిన ఫీడింగ్ ఛాంబర్ ప్రాజెక్టు.. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనగా మన్ననలు పొందింది. జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 60 ప్రదర్శనల్లో అంజన్న ప్రాజెక్టుకు కూడా చోటు లభించింది.
బహిరంగ ప్రదేశాల్లో బాలింతలు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న అంజన్న.. తన గైడ్, ఉపాధ్యాయుడు వేములవాడ రమేశ్ సహాయంతో ఫీడింగ్ ఛాంబర్కు రూపకల్పన చేశాడు. అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేయొచ్చు. పాలిచ్చే తల్లులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన ఫీడింగ్ ఛాంబర్ ప్రాజెక్టు.. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనగా నిలవడం పట్ల మల్కపల్లి పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అంజన్నపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరికి త్వరలోనే జాతీయ స్థాయి సర్టిఫికేట్, మెడల్, మెమోంటోను అందజేస్తామని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలిపారు.