బెల్లంపల్లి టౌన్, జూలై 14: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై భాస్కర్రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పల్లె సత్యనారాయణ ఆయన కుమారుడు పల్లె వేణు లారీ ఫైనాన్స్ విషయంలో చీటింగ్ కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.20 లక్షలకు అంగీకారం కుదిరింది. వేణు సోదరుడు నవీన్ ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారి సలహా మేరకు బుధవారం ఎస్సైకి నగదు అందించేందుకు వెళ్లారు. ఎస్సై సూచన మేరకు ప్రైవేట్ డ్రైవర్ రాజ్కుమార్ రూ.1.20 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిని గురువారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.