ఎవరెక్కడ పోతే నాకేంటి? ఎవరేమైపోతే నాకేంటి? రోడ్డుపై వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగితే ఫోన్తో ఫొటోలు తీస్తాం కానీ అదే ఫోన్తో డయల్ 108, 100కు మాత్రం ఫోన్ చెయ్యం. నాలాగే ఎంతోమంది చూస్తున్నారు.. ఎవరో ఒకరు కాపాడుతారులే, ఎవరో ఒకరు 108కి డయల్ చేసి ఉంటారులే. మనకెందుకీ గోల. మనకెందుకీ బాధ. చూసి అయ్యో పాపం అని వెళ్లిపోతే అయిపాయే. ఇంటికి వెళ్లి ఆ స్టోరీ ఇంట్లోవాళ్లకు చెప్తే సరిపాయే. మనం ఇలా ఆలోచించబట్టే కండ్లముందు విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఎన్నో కుటుంబాలు దిక్కులేనివిగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాజీవ్ రహదారిపై ఈ నెల 14న రాత్రి 11 గంటలకు యాక్సిడెంట్ అయ్యి ఓ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు 10 నిమిషాలపాటు రక్తపు మడుగుల్లో పడిఉన్నా ఎవ్వరూ పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం ఇవ్వకపోవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించటంతో ఈ దారుణ విషయం తెలిసింది. మెదక్ జిల్లాకు చెందిన మొలుగు చంద్రం పెయిటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14న శామీర్పేట్లో తన బంధువుల ఇంటికి వచ్చాడు. మద్యం సేవించి బైక్పై హెల్మెట్ లేకుండా బయలుదేరాడు. శామీర్పేట్ నుంచి తుర్కపల్లి చేరుకొంటున్న సందర్భంలో ముందున్న లారీని ఓవర్టేక్ చేయబోయి దాన్ని ఢీకొట్టి కిందపడ్డాడు. గాయాలై కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. ప్రమాదాన్ని చూసిన ఇతర వాహనదారులు, రోడ్డుపక్కన ఉన్న దాబా నిర్వాహకులు, అక్కడికి వచ్చివెళ్తున్నవారు ఎవరూ అతడిని లేపి రోడ్డుపక్కకు తీసే ప్రయత్నం చేయలేదు. హైవే కావటంతో చాలా వాహనాలు దూసుకొస్త్తున్నాయి. దీనికి తోడు వర్షం కూడా పడుతుంది. రోడ్డుపై పడి ఉన్న అతని దగ్గరివరకు వెళ్లిన వాహనాలు బ్రేకులు వేసి తిప్పుకొని వెళ్లాయి తప్ప కాపాడే ప్రయత్నం చేయలేదు. 10 నిమిషాలు గడిచాక వేగంగా వచ్చిన ఓ కారు అతని పైనుంచి ఎక్కించటంతో అక్కడే దుర్మరణం చెందాడు. అతడు మరణించిన అరగంటకు పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. చంద్రంపై కారు ఎక్కించిన డ్రైవర్ను గుర్తించి అతనిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సీసీ కెమెరాల్లో దృశ్యాలను చూసిన సైబరాబాద్ పోలీసులు మరుసటి రోజు ఆ ప్రాంతంలో రోడ్డుపక్కన వ్యాపారం చేస్తున్న వారితో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే 108, డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని దవాఖానకు తరలిస్తే పోలీసుల నుంచి ఎలాంటి పిలుపులు ఉండవని తెలిపారు. దవాఖానలో చేర్చి పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని కోరారు.