జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు
బంజారాహిల్స్, జూన్ 22: కొవిడ్ టీకాల పేరుతో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబుకు కుచ్చుటోపీ పెట్టిన నాగార్జునరెడ్డి అలియాస్ టిక్కిషెట్టి నాగేంద్రబాబు (27) అనే వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గార్జునరెడ్డి గత నెల 31న సురేశ్బాబుకు ఫోన్చేసి తమవద్ద 500 డోసుల కొవిడ్ టీకాలున్నాయని వాటిని రామానాయుడు స్టూడియోస్ సిబ్బందికి వేయించుకోవాలంటూ సూచించాడు. తన భార్య లక్ష్మి బ్యాంక్ అకౌంట్లోకి రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేస్తే ఆ టీకాలను అందజేస్తానని నమ్మబలికాడు. ఇది నిజమేనని భావించిన సురేశ్బాబు.. నాగార్జునరెడ్డి సూ చించిన అకౌంట్కు రూ.లక్ష పంపారు. నాగార్జునరెడ్డి వాటిని డ్రా చేసుకొని ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు. అతను ఇలాంటి మోసానికి పా ల్పడటం ఇదే తొలిసారి కాదు. మంత్రి కేటీఆర్ పీఏనని నమ్మబలికి టీకాల సరఫరా పేరుతో నాలుగు రోజుల క్రితం ఓ ఛానల్ నిర్వాహకులను మోసగించిన కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్నాడు. ఈ వ్యవహారంపై అతడిని విచారించగా నిర్మాత విషయం వెలుగులోకి వచ్చింది. సురేశ్బాబు సహాయకుడు రాజేంద్రప్రసాద్ సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగార్జునరెడ్డిపై ఐపీసీ 420, 406 సెక్షన్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణ కోసం నాగార్జునరెడ్డిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.