కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 6: ఏసీబీ దాడుల నేపథ్యం లో ఓ వ్యక్తి రూ.5 లక్షల నగదును తగులబెట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం కలకలం సృష్టించింది. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణాగౌడ్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కోరింటతండా సర్పంచ్ రాములునాయక్ గత జనవరిలో వెల్దండ మండలం బొల్లంపల్లి పంచాయతీ పరిధిలో 15 హెక్టార్ల స్థలంలో క్వారీ ఏర్పాటు కోసం మహబూబ్నగర్ జిల్లా మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అధికారులు ఎన్వోసీ కోసం వెల్దండ తాసిల్దార్కు అప్పగించారు. తాసిల్దార్ సైదులుగౌడ్ కల్వకుర్తిలో నివాసం ఉంటున్న వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన వెంకటయ్యగౌడ్ను సంప్రదించాలని సూచించాడు.
వెంకటయ్యగౌడ్ను కలువగా రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. తర్వాత రాములునాయక్ మహబూబ్నగర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనమేరకు.. మంగళవారం సాయంత్రం కల్వకుర్తిలోని వెంకటయ్యగౌడ్ నివాసంలో రాములునాయక్ రూ.5 లక్షలు అప్పగించి బయటకు వచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడు లు చేశారు. తలుపులు మూసి ఉండటంతో బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే గదిలో స్టవ్పై నోట్ల ను కాల్చుతుండగా.. వెంటనే నీళ్లు చల్లి ఆర్పారు. నగదును స్వాధీనం చేసుకొని వెల్దండ తాసిల్ కార్యాలయం, హైదరాబాద్ శివారులోని జిల్లెలగూడ వెంకటయ్యగౌడ్ ఇంటిపై, నాగోల్లోని తాసిల్దార్ సైదులుగౌడ్ ఇంటిపై ఏకకాలంలో దాడులు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. కాలిపోయిన నగదు, ఫైల్ను స్వాధీనం చేసుకొని ప్రత్యేక కోర్టులో అప్పగించనున్నట్టు ఆయన వెల్లడించారు.