హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెడ్మాస్టర్ పోస్టు మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాకరం అయ్యేలా కృషి చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. శనివారం ఎస్జీటీ టీచర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు వినోద్ కుమార్ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు విషయం అదేవిధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) గా విధులు నిర్వహిస్తున్న టీచర్స్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడనున్నట్లు వినోద్ కుమార్ హామీనిచ్చారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెడ్ మాస్టర్ పోస్టు మంజూరు కోసం కూడా తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. పండిట్ అప్గ్రేడేషన్ పోస్టులలో అర్హత కలిగిన ఎస్జీటీ టీచర్స్ కు అవకాశం కల్పించాలని టీచర్స్ సంఘం నాయకులు కోరగా వినోద్ కుమార్ అందుకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనుల కోసం సిబ్బంది నియామకాల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.