హైదరాబాద్, జూన్ 04, (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని డ్రైవర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 8.50 లక్షల మంది డ్రైవర్లకు కరోనా టీకాలు వేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జీహెచ్ఎంసీలోని పది సెంటర్లలో ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ నడుస్తున్నదని వివరించారు. శుక్రవారం ఉప్పల్ ఆర్టీఏ పరిధిలోని మల్లాపూర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పొందాలనుకునే డ్రైవర్లు వెంటనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కొవిడ్-19 నిబంధనలు పక్కాగా పాటిస్తూ ప్రజలంతా భద్రంగా ఉండాలని, మాస్క్ తప్పక ధరించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు, ఆర్టీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.