హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ రంగంలో అంతర్జాతీయస్థాయిలో ప్రఖ్యాతిగాంచిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూపు తెలంగాణలో రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఆభరణాల తయారీ పరిశ్రమతోపాటు గోల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మలబార్ గ్రూపు అధినేత ఎండీ అహ్మద్ నేతృత్వంలోని సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమైంది. ఈ సందర్భంగా పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలతోపాటు ఇక్కడ నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని బృందం తెలిపింది. పెట్టుబడిదారులతో రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించింది. తమ గ్రూపునకు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని.. తెలంగాణలో తమ ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా కంపెనీ ఆభరణాల తయారీ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడితో బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ పరిశ్రమ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీంతో సుమారు 2500 మంది నైపుణ్యంగల స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నది.
తెలంగాణ ప్రభుత్వ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతోపాటు ఇక్కడి వ్యాపార అనుకూలతలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన మలబార్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆభరణాల తయారీలో అద్భుతమైన నైపుణ్యంగల స్వర్ణకారులున్నారని, కంపెనీ ఉద్యోగాల కల్పనలో వారిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున మలబార్ గ్రూపునకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.