మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండల పరిధి ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 13వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కలెక్టర్ హరీశ్కు సూచించారు. బుధవారం ఏడుపాయల జాతర నిర్వహణ కోసం హరిత రెస్టారెంట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏడుపాయల జాతరకు సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశామని, అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జాతర కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని వదలడంతో పాటు వివిధ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు పదకొండు వందల మంది పోలీసులతో జాతర బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.