సిద్ధిపేట: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అన్ని కార్యాలయాలు ఒక్కచోటికి తరలించడంతో అటు ప్రజలకు..ఇటు అధికారులకు సౌకర్యంగా మారుతుందని మంత్రి అన్నారు.
తద్వారా పనులు వేగంగా పూర్తవుతాయన్నారు. సిద్ధిపేట సమీపంలోని రాజీవ్ రహదారి వెంట దుద్దెడ శివారులో నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనం, కమిషనరేట్ భవనాన్ని నిర్మించారు. జూన్ 20న సిద్ధిపేటలో ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని హరీశ్ రావు బుధవారం అధికారులను ఆదేశించారు.