హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి చిన్న పిల్లలను ఎలా కాపాడుకోవాలి? అని ఆందోళనచెందుతున్న తల్లిదండ్రులకు ఇజ్రాయెల్ పరిశోధకులు తీపికబురు చెప్పారు. బాలింతలు కరోనా టీకా వేసుకుంటే ప్రతిరక్షకాలు తల్లిపాల ద్వారా బిడ్డకు చేరుతున్నాయని, కరోనా సోకకుండా అవి రక్షణ కల్పిస్తున్నాయని నిర్ధారించారు. డిసెంబర్ 23-జనవరి 15 మధ్య ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ తీసుకున్న 84 మంది బాలింతల వివరాలు సేకరించారు. వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత తల్లిపాల నమూనాలను విశ్లేషించగా రెండోవారంలోనే 68 శాతం నమూనాల్లో ప్రతిరక్షకాలు కనిపించాయి. ఆరోవారం నాటికి 97 శాతం నమూనాల్లో యాంటీబాడీస్ ఉన్నట్టు తేలింది. వీటివల్ల పిల్లల్లో గానీ, బాలింతల్లో గానీ ఆందోళన కలిగించే దుష్ప్రభావాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. నలుగురు పిల్లలకు మాత్రం జ్వరం వచ్చిందని, 47 మంది బాలింతలకు జ్వరం, టీకా వేసిన దగ్గర నొప్పి, చర్మంపై మంట వంటివి కలిగినట్టు పేర్కొన్నారు.