సూర్యాపేట, మే 13 : మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో వ్యవసాయ కూలీలతో పాటు ఇతరులు సైతం ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,71,468 మంది ఉపాధి పనలకు హాజరవుతున్నారు. గతేడాది మే 12 నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,96,854 మంది పనులకు వచ్చారు. గతేడాదితో పోలిస్తే కూలీల సంఖ్య కొంత తగ్గినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. చెరువుల పూడిక తీత, ఫీడర్ చానల్ నిర్మాణం, ఆధునీకరణ, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల అభివృద్ధి, హరితహారం వంటి పనులతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్న మరిన్ని పనులను ఉపాధి పథకం కింద చేపడుతున్నారు. ఇందులో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వంద రోజుల పాటు పనులు కల్పిస్తారు. సూర్యాపేట జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 66.51 లక్షల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 2.68 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉన్నాయి. సుమారు 6.22 లక్షల మంది కూలీలు ఉన్నారు. కానీ 1.87 లక్షల జాబ్కార్డులకు చెందిన 3.72 లక్షల మంది మాత్రమే ఉపాధి పనులకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత తగ్గి 60 వేల మంది మాత్రమే వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్యను లక్ష వరకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల మొదటి, రెండో వారం నుంచి ఉపాధి పనులు ముమ్మరంగా సాగాల్సి ఉండగా ఈ ఏడాది అకాల వర్షాలతో కూలీల సంఖ్య తగ్గింది. వ్యవసాయ పనులు చేసుకొనే వారు వర్షాల వల్ల ధాన్యం అమ్ముకోవడానికి కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ముగియ వస్తుండడంతో తిరిగి ఉపాధి పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మే 20 నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లక్ష మంది చొప్పున ఉపాధి పనులకు హాజరయ్యేలా అధికారులు కసరత్త చేస్తున్నారు. ఉపాధి కూలీలు పని చేసే చోట ప్రభుత్వం వారికి వసతులు సైతం కల్పిస్తున్నది. నీడకోసం టెంట్ ఏర్పటుతోపాటు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుతోంది. వడదెబ్బ నుంచి రక్షణ కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో 3.90 లక్షల కుటుంబాలకు జాబ్కార్డులు ఉండగా సుమారు 9 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో 5 లక్షల మంది కూలీలు యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 84 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. గతేడాది మే 12 నాటికి జిల్లాలో రోజుకు 98 వేల మంది ఉపాధి పనులు చేసేందుకు వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం 421 గ్రామ పంచాయతీల్లో గతేడాది 37 వేల మందితో ఉపాధి పనులు చేయించగా ప్రస్తుతం 28 వేల మంది పనులకు హాజరవుతున్నారు.
ఉపాధి కూలీల సంఖ్య ఈ ఏడాది కొంత తగ్గిన మాట వాస్తవమే. వ్యవసాయ పనులు, అకాల వర్షాల కారణంగా కూలీలు ఇప్పుడిప్పుడే పనులకు వస్తున్నారు. దాంతో వారం రోజులుగా క్రమంగా కూలీల సంఖ్య పెరుగుతున్నది. గతేడాది లాగానే రోజుకు లక్ష మందికి ఉపాధి పనులు కల్పించి రాష్ట్రంలో జిల్లాను నంబర్ వన్ స్థానంలో నిలుపుతాం. అందుకు క్షేత్ర స్థాయిలో పనులను ముమ్మరం చేస్తున్నాం.
– సుందరి కిరణ్కుమార్, డీఆర్డీఓ సూర్యాపేట