పెండ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. ఇదెంత వరకు నిజమో కానీ, విడాకులు మాత్రం లాక్డౌన్ సమయంలోనే ఖరారవుతున్నాయి. గతంలో పరిస్థితి వేరు. ఇల్లు, ఆఫీసు, టూర్లు, మీటింగ్లు.. ఎవరి ‘స్పేస్’ వారికి ఉండేది. అతని ఆఫీసులోకం అతనిది, ఆమె ఆఫీసు ప్రపంచం ఆమెది. ఇప్పుడు ఆ సరిహద్దులు చెరిగి పోయాయి. భర్త ఆఫీసు పనులను భార్య గమనిస్తున్నది. భార్య ఆఫీసు రాజకీయాలు భర్తకు తెలిసి పోతున్నాయి. దీంతో, ఒకరి పని విషయంలో మరొకరి జోక్యం పెరిగిపోతున్నది. ఉచిత సలహాలు ఎక్కువై పోతున్నాయి. ఆలూమగల మధ్య అగాథానికి ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణమే. జీతాల్లో కోతలు, రాత్రికి రాత్రి తొలగింపులు కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఫలితంగా, ఇండ్లలో ఎత్తి పొడుపులు, సాధింపులు సాధారణమవుతున్నాయి. గతంలో ఎన్ని గొడవలున్నా చీకటి పడేసరికి అవన్నీ సద్దు మణిగేవి. తెల్లారేసరికి చిరునవ్వుతో ఒకరికొకరు ‘గుడ్ మార్నింగ్’ చెప్పుకొనేవారు. కానీ, ప్రస్తుత కరోనా భయంతో లైంగిక జీవితానికి దూరమై పోతున్నారు చాలామంది దంపతులు. దీంతో ‘ఆకర్షణ మంత్రం’ పని చేయడం లేదు. ఆలూమగల మధ్య దూరం పెరగడానికి ఇవన్నీ కారణమేనని అంటున్నారు మానసిక నిపుణులు.