నెల్లికుదురు, మహబూబాబాద్ : జిల్లా పరిధిలో ప్రతి పాజిటివ్ కేసును ఏఎన్ఎంలు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని, వైరస్ లక్షణాలు రికార్డ్ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ నెల్లికుదురు, చిన్న నాగారం గ్రామాల్లో పర్యటించి పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ముందుగా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం నెల్లికుదురు మండల టాస్క్ఫోర్స్ అధికారులతోనూ, వైద్య అధికారులతో సమీక్షించారు. లాక్ డౌన్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
మండల కేంద్రానికి పని లేకుండా ఎవరూ రాకూడదని, కాలక్షేపానికి వచ్చే వారి వాహనాలను సీజ్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్లో ఉన్నవారి వివరాలను ఇవ్వాలని తాసిల్దార్ను ఆదేశించారు. అనంతరం కార్యాలయం వద్ద ఉన్న వసతి గృహంలో పాజిటివ్ వ్యక్తులకు నిర్వహిస్తున్న పరీక్షలు, మందుల పంపిణీలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
మండలంలోని చిన్న నాగారం గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి పాజిటివ్ వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య వివరాలను సేకరించారు. పాజిటివ్ వ్యక్తుల వివరాలు పల్స్ ఆక్స్ మీటర్ , ధర్మామీటర్ లతో పరీక్షించి ప్రతి ఒక్కటి రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ వెంట వైద్యాధికారి హరీష్ రాజు, ఉప వైద్యాధికారి మురళీధర్, ప్రత్యేక అధికారి బాలరాజు, తాసిల్దార్ రమేష్, ఎంపీడీవో వేణుగోపాల్, జడ్పీటీసీ ఎర్రబెల్లి మాధవి, నెల్లికుదురు సర్పంచ్ యాదగిరి రెడ్డి, చిన్న నాగారం సర్పంచ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.