ఖైరతాబాద్, ఆగస్టు 11: ఎస్సీ వర్గీకరణ కోసం సెప్టెంబర్ 1 నుంచి మాదిగల మేలుకొల్పు యాత్ర నిర్వహిస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. కుత్బుల్లాపూర్లో మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో యాత్ర ప్రారంభించి, సెప్టెంబర్ 30న తుంగతుర్తిలో ముగింపు సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ యాత్ర వంద నియోజకవర్గాల్లో నాలుగు విడతలుగా కొనసాగుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏడేండ్లుగా కేంద్ర ప్రభుత్వ తాత్సారం, రాష్ట్ర ప్రభుత్వ కృషి, మందకృష్ణ మాదిగ వైఖరి గురించి వివరిస్తామని వెల్లడించారు. మందకృష్ణ మాదిగలకు ఏడుశాతం రిజర్వేషన్లు అడుగుతుండగా, తాము 12 శాతం కోరుతున్నట్టు వివరించారు. దళితులపై బీజేపీ దాడులు, చాకలి, నాయిబ్రాహ్మణ, మాదాసిలను ఎస్సీ జాబితాలో చేర్చడం, వడ్డెరలకు మైనింగ్ కార్పొరేషన్, పందుల పెంపకాన్ని పరిశ్రమగా గుర్తించి, ఎరుకలకు షెడ్ల నిర్మాణం, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు తదితరాలపై వివరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగరావు, ఎంహెచ్పీఎస్ అధ్యక్షుడు మైస ఉపేందర్, కన్వీనర్ గజ్వెల్లి మల్లికార్జున్, మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వినాయకరావు, దళితదండు అధ్యక్షుడు జీ బాలరాజు, తెలంగాణ మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వడ్డె ఎల్లన్న, మాదిగ సంఘాల జేఏసీ నాయకులు రామగల్ల సుందర్, ముచ్చర్ల శ్రీనివాస్, దేవరకొండ నరేశ్, మీసాల మహేశ్, బీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.