సైబర్ నేరాలను నివారించడంతో పాటు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునేందుకు సైబర్ నిపుణుల సహాయం తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం కేరళలో కొనసాగుతున్న సైబర్డోమ్ ప్రాజెక్ట్ పనితీరును అధ్యయనం చేసేందుకు కేరళకు ఓ బృందాన్ని పంపించే దిశగా ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సైబర్నేరాలను అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అవసరముంటాయి. నేరగాళ్లు వాడే సాఫ్ట్వేర్ను గుర్తించి దానికి విరుగుడు కనిపెడితే సైబర్నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో హెథికల్ హ్యాకర్స్ కూడా అవసరముంటుంది. పోలీసు విభాగం వద్ద ఉన్న టెక్నాలజీ అప్గ్రేడ్ వర్షన్ ఉంటున్నా.. ఐటీపై పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉన్నవారు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటున్నారు. మిగతా వారు సాంకేతికపరమైన అంశాలపై అవగాహన పొందుతూ దర్యాప్తులో చురుకుగా పాల్గొంటున్నా.. సమయం అంతా వాళ్లు దర్యాప్తు చేసే కేసులకే సరిపోతుంది. కొత్త ఆలోచనలు చేసే సమయం కూడా పోలీసులకు ఉండటం లేదు. సైబర్నేరాలకు అడ్డుకట్ట వేయడం, ప్రధాన కేసుల దర్యాప్తులో సైబర్నిపుణుల సహకారం తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నారు.
సైబర్డోమ్ ఇలా పనిచేస్తుంది
పోలీసులకు సైబర్ సెక్యూరిటీ, సైబర్ కేసుల దర్యాప్తులో సహాయం చేసేవారందరినీ ఒక దగ్గరకు చేర్చుతారు. సైబర్నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు సలహాలు సూచనలు ఇచ్చేవారు, ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులతో షేర్ చేసుకునే వారిని ఈ గ్రూప్లోకి ఎంచుకుంటారు. ఇందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, హెథికల్, సైబర్ నిపుణులను వలంటీర్లుగా తీసుకొని సైబర్డోమ్ వలంటీర్స్గా పిలుస్తారు. వలంటీర్ల పనితీరును గుర్తించిన తరువాత అసిస్టెంట్ కమాండ్, డిప్యూటీ కమాండర్, సైబర్డోమ్ కమాండర్లుగా పిలుస్తారు. వీటితో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశోధన సంస్థలు, అకాడమీ సంస్థలు, ఎన్జీఓలను కూడ భాగస్వాములు చేస్తున్నారు. వీళ్లంతా కలిసి పోలీసులకు తగిన సహకారం అందిస్తున్నారు. ఇలా కేరళ పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్డోమ్ కొంత మేర ఫలితాలు కూడా రాబడుతున్నది.
ప్రజలకు మెరుగైన సేవలు
సైబర్డోమ్లో స్వచ్ఛందంగా పనిచేసే వారు లాభాపేక్ష లేకుండా పనిచేయాలి. పోలీసులతో కలిసి తాము ప్రజలకు సహాయం చేస్తున్నామని, ప్రజా సేవలో ఉన్నామనే భావనతోనే వలంటీర్లుగా చేరాల్సి ఉంటుంది. వలంటర్లీగా ముందుకు వచ్చే వారు, పోలీసులు సూచించే నిబంధనలు తప్పనిసరిగా పాలించాలి. మెరుగైన సమాజం కోసం పనిచేస్తూ, సైబర్ నేరాలు జరుగకుండా, సైబర్ క్రిమినల్స్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ నేరస్థుల ఆగడాలకు చెక్పెట్టే విధంగా ఈ వ్యవస్థ పనిచేయాల్సి ఉంటుంది. సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు కేరళకు వెళ్లి, అక్కడ సైబర్డోమ్ పనితీరుపై అధ్యయనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ అధ్యయనం తరువాత హైదరాబాద్లో సైబర్డోమ్ ఏర్పాటుపై ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.