యాదాద్రి భువనగిరి : వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమిస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రత్యేక అధికారి ఎవరో కాదు.. జిల్లా కలెక్టరే అని తెలిపారు. తల్లైనా, తండ్రైనా కలెక్టర్ పమేలా సత్పతినే. జిల్లా అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి కలెక్టర్ పనులు చేయిస్తారు. గ్రామ అభివృద్ధికి నూరో, నూట యాభై కోట్లు ఇస్తాం. కానీ ఆ నిధులు వినియోగించాలి. అప్పుడే అభివృద్ధి జరిగినట్టు. గ్రామంలో జబ్బు పడిన వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులు, పదవీ విరమణ ఉద్యోగులు కలిసి కమిటీలను ఏర్పాటు చేసి.. అభివృద్ధికి సహకరించాలి. చదువుకోని వారికి చదువుకున్న వారు సహకరించాలి. ప్రజల కోసం పని చేసే కలెక్టర్ మీకు ఉన్నారు. ఆమె సేవలను వినియోగించుకోవాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.