శంషాబాద్, మే 19: కరోనా విపత్కర పరిస్థితులలో కరోనా రోగులు, బాధితుల పట్ల మానవతతో సేవలందించాలని, అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడడం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రవేట్ దవాఖానలపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శంషాబాద్లోని ప్రైవేట్ దవాఖానలు అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కొందరు బాధితులు ప్రకాశ్గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనతో పాటు శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొనల్ సుష్మా మహేందర్రెడ్డి బుధవారం స్వయంగా శంషాబాద్లోని ట్రిడెంట్, లిమ్స్తో పాటు ఇతర ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల నిర్వహణ, వైద్యం, ఫీజుల వసూళ్లు, బాధితుల ఇబ్బందులపై ఆకస్మిక తనిఖీ చేశారు. బాధితులను సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. యాజమన్యాలు, వైద్యులు, సిబ్బందితో చర్చించారు. కొవిడ్ పేషెంట్ల రేట్లు ఒక రోజుకు ఐసొలేషన్ వార్డులో రూ. 4,500, ఐసీయూ రూ. 7,500, ఐసియూ+ వెంటిలేటర్ రూ. 9, 500 తీసుకోవాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి, బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని విధాల కృషి చేస్తున్నదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మామహేందర్రెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా శంషాబాద్ కూరగాయల మార్కెట్ను రెండుగా విభజించారు. మార్కెట్ నుంచి ఆకుకూరల అమ్మకాలను తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. బుధవారం శంషాబాద్ కూరగాయల మార్కెట్ ఆకస్మిక తనిఖీ చేసిన చైర్పర్సన్ వ్యాపారులు, రైతులు, చిరువ్యాపారులకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
కరోనా కట్టడిపై పోలీసుశాఖ కూరగాయల మార్కెట్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసిందని ఏసీపీ భాస్కర్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అమ్మకాలు పూర్తి చేయాలని సూచించారు. కూరగాయల అమ్మకం దారులు 50 శాతం మార్కెట్లో మరో 50 శాతం ఆకుకూరల అమ్మకాలను తాసీల్దార్ కార్యాలయం సమీపంలో చేయాలని వివరించారు. నిబంధనలను ఏమాత్రం అతిక్రమించరాదని తెలిపారు.