హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): పోయిన వానకాలంలో వద్దనుకున్న మక్కజొన్న పంటను ఈ వానకాలంలోనూ పక్కన పెట్టడమే ఉత్తమం. బహిరంగ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, తగిన ధర రాకపోవడం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. కాదు కూడదు అంటూ మక్కలు సాగు చేస్తే మాత్రం నష్టాలు మూటకట్టుకోవడం ఖాయం. దేశీయంగా, అంతర్జాతీయంగా అవసరానికి మించి మక్కల నిల్వలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మక్కలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ కొనాల్సి వచ్చినా.. అతి తక్కువ ధరను నిర్ణయిస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయం ప్రకారం మక్కల మద్దతు క్వింటాలుకు రూ. 1800 కాగా.. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ. వెయ్యి నుంచి రూ. 1200లకు మించడం లేదు. ఆ ధరకు కొనేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
వద్దని హితవు చెప్పినా సాగు
అంతర్జాతీయంగా మక్కలకు డిమాండ్ తగ్గడాన్ని ముందే గమనించిన సీఎం కేసీఆర్ రైతులను మేల్కొలిపారు. మక్కజొన్న సాగుచేయొద్దని సూచించారు. చాలామంది రైతులు సీఎం చెప్పిన మాటలకు అనుగుణంగా మక్కజొన్న సాగుకు దూరంగా ఉన్నారు. కొందరు రైతులు మాత్రం ఎందుకో వద్దన్న మక్కజొన్ననే పనిగట్టుకుని సాగుచేశారు. రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో పెద్దమనసు చేసుకున్న సీఎం కేసీఆర్ మక్కలను కొనుగోలు చేశారు. సీఎం ఆదేశాలతో మార్క్ఫెడ్ 2.66 లక్షల టన్నుల మక్కలను మద్దతు ధర రూ. 1800లకు కొన్నది. ఇప్పుడు ఆ మక్కలు ఇంకా గోదాముల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం విక్రయించేందుకు ప్రయత్నిస్తే వ్యాపారులు ముందుకు రాలేదు.. వచ్చిన వారు క్వింటాలు రూ. 1200 చొప్పున కొనేందుకు టెండరు వేశారు. ఈ విధంగా మక్కలకు డిమాండ్ లేకపోవడంతో ఇటు రైతులకు, అటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అందుకే సీఎం కేసీఆర్ మక్కజొన్న సాగు వద్దని సూచించారు.
మక్కలకు బదులుగా పత్తి, కంది డిమాండ్ లేని పంటలను సాగుచేసి నష్టపోవడానికి బదులుగా మార్కెట్లో డిమాండ్ గల పంటలను పండించడం మేలని ప్రభుత్వం రైతులకు సూచిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ సీజన్లో అధికమొత్తంలో పత్తి, కంది సాగు చేయాలని పిలుపునిచ్చింది. వరి, మక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా పత్తి, కంది సాగుచేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశమున్నది. మార్కెట్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటను విక్రయించుకోవచ్చు. అందుకే ఈ వానాకాలం సీజన్లో మక్కజొన్న పంటను సాగు చేయొద్దని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.