వీణవంక, జూలై 17: ఈటల రాజేందర్ వల్లే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకుడు గుండాల మదన్కుమార్ ముదిరాజ్ ఆరోపించారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంకలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీలేదని మండిపడ్డారు. ఏ ఒక్క కులానికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదన్నారు. బీసీలు తమ సమస్యలను ఈటల దృష్టికి తీసుకెళ్తే ఉద్యమం చేస్తే అవే పరిష్కారమవుతాయని రెచ్చగొట్టే వాడని గుర్తుచేశారు. పదవిలో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించిన ఈటల.. ఇప్పుడు బీజేపీ కండువా ఎందుకు కప్పుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పారు. నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమాతో రైతన్నలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి రానున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు, ట్రస్మా అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.