మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ లాంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేట్పరం చేయడం దారుణమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ అన్నారు. కేంద్రం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం తీరుతో విసిగిపోయిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా టీఆర్ఎస్కు మద్దతు తెలియజేస్తున్నారని చెప్పారు. శుక్రవారం మహబూబ్నగర్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో వలసలు ఆగిపోయాయని, సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణలో సాగునీటి వసతి పెరగడంతో ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. మహబూబ్నగర్లో ఐటీ పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయని, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి తోబుట్టువుల్లాంటివాళ్లని అన్నా రు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలన్నీ సీఎం కేసీఆర్ తీరుస్తున్నారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఆరేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. ఉద్యోగులు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. అనంతరం మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. విద్యావంతురాలు, ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాణీదేవిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తిచేశారు. అంతకుముందు మెట్టుగడ్డలోని ఎలక్ట్రిసిటీ యూనియన్, డిస్ట్రిక్ట్ క్లబ్లో మంత్రి, ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.