న్యూఢిల్లీ: మే నెలలో కోవిడ్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నెలలో ఢిల్లీలో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించాయి. అక్కడ డెత్ రేటు 2.9 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగటు 1.3 శాతం కన్నా రెట్టింపు అని అధికారులు చెప్పారు. ఓ పత్రిక కథనం ప్రకారం.. పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు కన్నా రెట్టింపు సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. పంజాబ్లో 2.8 శాతం, ఉత్తరాఖండ్లో 2.7 శాతంతో మరణాలు నమోద అయ్యాయి. కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన తర్వాత.. ఇంత అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించింది మే నెలనే కావడం గమనార్హం.
ఢిల్లీలో మే నెలలో మొత్తం 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాంట్లో 8900 మంది మరణించారు. అంటే సీఎఫ్ఆర్ 2.92 శాతంగా ఉన్నట్లు గమనించారు. ఇక మహాకుంభ మేళా జరిగిన ఉత్తరాఖండ్లో వైరస్ వల్ల మే నెలలో నమోదు అయిన మరణాలు 59 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో ప్రతి గంటకు కనీసం 165 మంది కోవిడ్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా 1.48 లక్షల మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే అంతే మంది మరణించినట్లు తెలుస్తోంది. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఈ మే నెలలోనే 33 శాతం మరణాలు సంభవించాయి. మే నెలల ప్రతి రోజు సగటున 3400 మంది ప్రాణాలు విడిచారు. కనీసం 13 రోజుల పాటు ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. మే 19వ తేదీన అత్యధికంగా 4529 మంది వైరస్కు బలయ్యారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల 577 మంది పిల్లలు అనాథలయ్యారు. ఇండియాలో వ్యాక్సిన్ తీసుకునేందుకు 18 ఏళ్లు దాటిన వారి సంఖ్య 94 కోట్లుగా ఉన్నది.