న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో లోక్సభ సభ్యులు ప్రవీణ్ నిషాద్ పాల్గొన్నారు. యూపీలోని సంత్కబీర్ నియోజకవర్గం ఎంపీ నిషాద్.. ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని తన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మనం నాటిన ప్రతి మొక్క వృక్షంగా ఎదిగే వరకు వాటిని కాపాడాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్కు ఎంపీ నిషాద్ అభినందనలు తెలియజేశారు.