ప్రత్యేక ప్రతినిధి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లను సమర్థంగా అమలుచేయడం వల్ల తెలంగాణతోపాటు దేశంలోని చాలా ప్రాంతాలలో కేసులు తగ్గాయని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, ప్రస్తుత సలహాదారు రాకేశ్మిశ్రా తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యతతో మెలిగి, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే మూడో ముప్పును తేలికగా ఎదుర్కోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో డెల్టా వేరియంట్ (బీ.1.617.2) అతి వేగంగా విస్తరించినా దాని తీవ్రత (విరులెన్స్) తక్కువగా ఉందని ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. కానీ తమ పరిశీలనలో పాజిటివ్ రేటు అంతగా తగ్గలేదన్నారు. ప్రజలు ఒక చోట గుమిగూడక పోవడం, విందులు, శుభకార్యాలకు దూరంగా ఉండటం వల్ల కేసుల సంఖ్యలో మార్పు వచ్చిందని తెలిపారు.
అలాగే మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం, పెండ్లిండ్లు, విందులు, వినోదాలకు పరిమిత సంఖ్యలోనే అనుమతించడం, జాతరలను అనుమతించకపోవడం వల్ల కరోనా మూడో ముప్పును నిలువరించవచ్చని సూచించారు. లాక్డౌన్లను ఎంతోకాలం కొనసాగించలేరన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కసారిగా కాకుండా లాక్డౌన్లను దశలవారీగా సడలించడం మంచిదని ఆయన సూచించారు. లాక్డౌన్ల వల్ల పేదల ఉపాధి దెబ్బతింటుదని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నది కాదనలేని కఠోర వాస్తవమని పేర్కొన్నారు. మొదటి దశలో కరోనా వైరస్ తీవ్రత తొందరగానే తగ్గినా చాలామంది ప్రాథమిక జాగ్రత్తలను విస్మరించడం వల్ల రెండవ దశ ముప్పు ముంచుకువచ్చిందని విశ్లేషించారు. కాస్త ఆలస్యంగానైనా లాక్డౌన్ల ద్వారా కరోనా వైరస్ను బ్రేక్డౌన్ చేయడానికి జరిగిన కృషి అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను తొందరగా పూర్తిచేస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశముంటుందన్నారు.