పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటల
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, బిగాల గణేశ్గుప్తా అడిగిన ప్రశ్నలకు, బడ్జెట్పై చర్చలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటికే 350 బస్తీ దవాఖానలు మంజూరుచేశారని.. వీటిని ఇతర పెద్ద నగరాలకు విస్తరించాలన్న యోచనలో సీఎం ఉన్నారని చెప్పారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పదివేలమందికి ఒక బస్తీ దవాఖానను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. దవాఖానల్లో పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవల వికేంద్రీకరణ ప్రారంభించామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ఉన్న సౌకర్యాలను మరో 9 దవాఖానల్లో ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ ముందున్నదని.. రాష్ట్రంలో నిర్దేశించిన లక్ష్యంలో 65 శాతం మందికి టీకాలు వేశామని చెప్పారు. 25 ఏండ్లకుపైబడినవారికి టీకాలు వేసేందుకు త్వరలో డోసులు అందించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. దేశంలో కొవిడ్ను ప్రభావవంతంగా ఎదుర్కొన్న మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నదని ఈటల చెప్పారు.
గిరిజనులకు రూ.50 వేల కోట్లు: మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన ఉప ప్రణాళిక కింద టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.50,381 కోట్లు కేటాయించామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బీజేపీ సభ్యుడు రఘనందన్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిస్తూ, 2017 నుంచి గిరిజన ప్రత్యేక ప్రగతి నిధి ద్వారా రూ.34,615 కోట్లు, అంతకు ముందు మూడేండ్ల సమయంలో రూ.15,766 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో గిరిజన జనాభా కంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించారన్నారు.
సీఎంతో చర్చించాక సీట్ల పెంపుపై నిర్ణయం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బాసరలోని ట్రిపుల్ ఐటీలో సీట్ల పెంపు అంశంపై సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకొంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యుడు విఠల్రెడ్డి అడిగిన ప్రశ్నకు, బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాసరలో ట్రిపుల్ఐటీ స్థాపించిన కొత్తలో రెండువేల సీట్లు ఉండేవని, 2010లో వెయ్యికి తగ్గించారని చెప్పారు. 2018లో సీఎం కేసీఆర్ 1500 సీట్లకు పెంచారని చెప్పారు. ఈ సంఖ్యను 2వేలకు పెంచే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు త్వరలో వీసీలను నియమిస్తామని ప్రకటించారు. గుర్తించిన 1,065 ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడంపై గతంలో తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి విధివిధానాలు రూపొందిస్తామని ఆమె వెల్లడించారు.
కేంద్రం పైసా ఇవ్వడంలేదు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు, నర్సరీలను ఏర్పాటుచేశామని వీటికి కేంద్రం నిధులివ్వటం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు మంచిరెడ్డి కిషన్రెడ్డి, దుర్గం చిన్నయ్య, క్రాంతికిరణ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ 95 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు వారి ఎంపీలతో మాట్లాడి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే విధంగా చూడాలన్నారు. 8,001 శ్మశాన వాటికలు, 12,301 డంపింగ్ యార్డులు పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన వాటిని ఏప్రిల్ చివరినాటికి పూర్తిచేస్తామని చెప్పారు.
పామాయిల్ నర్సరీలను పెంచుతాం: మంత్రి నిరంజన్రెడ్డి
పామాయిల్ మొక్కల నర్సరీలను వర్షాకాలం నాటికి పెంచుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. విత్తనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, అందుకే నర్సరీల ఏర్పాటు జాప్యమవుతుందన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు దుర్గం చిన్నయ్య, సండ్ర వెంకటవీరయ్య, బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్రెడ్డి సమాధానమిస్తూ 25 జిల్లాల్లో 8.14 లక్షల ఎకరాల్లో సాగుచేయడానికి కేంద్ర సాంకేతిక బృందం ఆమోదం తెలిపిందన్నారు. రైతులను ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.30 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. రాబోయే రోజుల్లో 95% వ్యవసాయాన్ని యంత్రాలద్వారానే చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2021-22 బడ్జెట్లో యాంత్రీకరణకు రూ.1500 కోట్లు కేటాయించారన్నారు. భారీ యంత్రాలు కొనుగోలుచేసే సామర్థ్యం రైతులకు లేనందున.. వీటిని కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా రైతులకు అద్దెకు ఇస్తున్నామన్నారు. చిన్న యంత్రాలు, తక్కువ ధర ఉండే పరికరాలను రైతులకు వ్యక్తిగతంగా 50% సబ్సిడీపై అందిస్తున్నామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.