హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జూబ్లీహిల్స్ నుంచి నేరుగా నార్సింగి-పుప్పాలగూడ మధ్యనున్న ఓఆర్ఆర్నను కలిపేలా సుమారు 7 కిలోమీటర్ల దూరం లింకురోడ్డు నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో ఉన్న ఈ రోడ్డు మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా నిర్ణీత సమయంలో చేరుకోవచ్చు. నార్సింగి, కోకాపేట, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు ప్రాంతాలకు సులవుగా రాకపోకలు సాగించవచ్చు. ఈ లింకురోడ్డు జూబ్లీహిల్స్ రోడ్ 45లో పెద్దమ్మ టెంపుల్ సబ్స్టేషన్ నుంచి మొదలై, జూబీహిల్స్ రోడ్ నంబర్ 51, 70 మీదుగా రాయదుర్గం మల్కంచెరువు, మణికొండ చిత్రపురి కాలనీ, ల్యాంకోహిల్స్ మీదుగా ఔటర్ రింగురోడ్డును మైహోం అవతార్ జంక్షన్ వద్ద కలుస్తుంది. ఇప్పటికే పలు లింకురోడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా ల్యాంకోహిల్స్ నుంచి మైహోం అవతార్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేస్తే ఆరులేన్లతో విశాలమైన రహదారిని నిర్మించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.