హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల కేంద్రం నుంచి సానుకూలస్పందన వ్యక్తమైంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి, రాష్ట్రంలో మరో ఆరు ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల పట్ల పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు, దాని అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకొంటామన్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సింధియా శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. కేంద్రమంత్రి గౌరవార్ధం సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని కేంద్రమంత్రిని కోరారు. బిజినెస్ హబ్గా, ఐటీ హబ్గా, హెల్త్ హబ్గా, టూరిజం హబ్గా హైదరాబాద్ నగరం విస్తరిస్తున్నదని చెప్పారు. అందువల్ల దేశంలోని పలు ప్రాంతాల నుంచి, పలు అంతర్జాతీయ నగరాల నుంచి ప్రయాణికులు ఇక్కడికి వస్తున్నారని ఆయన తెలిపారు. ఆగ్నేయాసియా, ఐరోపా దేశాలకు, అమెరికాకు ఇక్కడినుంచి నేరుగా విమాన సర్వీసులను పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాల అభివృద్ధి, ఆపరేషన్ల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిని కోరారు. ఈ విషయంలో విమానయాన మంత్రిత్వశాఖ తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రంగాల్లో అభి వృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ర్టానికి అన్ని రకాలుగా సహ కారం అందించాలని కోరారు.
త్వరలో మామునూరులో ఏటీఆర్ ఆపరేషన్లు
సీఎం ప్రతిపాదనలపై స్పందించిన కేంద్రమంత్రి సింధియా మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. భవిష్యత్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రతిపాదించిన ఆరు ఎయిర్పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు)లో ఎయిర్పోర్టు అథారిటీకి భూమి అందుబాటులో ఉన్నదని, (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్పల్లి)లో ఎయిర్పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామని పేరొన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టును ఎయిర్ఫోర్స్ ద్వారా ఏర్పాటుచేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి (బసంత్నగర్), కొత్తగూడెం, మహబూబ్నగర్ (దేవరకద్ర) ఎయిర్పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకలకు ఉన్న అవకాశాలపై పునఃపరిశీలన చేసి, చర్యలు తీసుకుంటామని సింధియా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, ఎంపీలు సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డి, కేంద్ర పౌర విమానయానశాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.