హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రెమ్డెసివిర్ ఖాళీ సీసాల్లో స్లైన్ నీళ్లుపోసి విక్రయిస్తున్న ముగ్గురిని ఏపీ టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టుచేశారు. విజయవాడ దుర్గాపురం వాసి కిశోర్ (39) సూర్యారావుపేటలోని ఒక ప్రైవేటు దవాఖానలో మత్తుమందు టెక్నీషిన్గా పనిచేస్తున్నాడు. అక్కడ రోగులకు వినియోగించిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల ఖాళీసీసాలను సేకరించి.. వాటిలో స్లైన వాటర్ నింపి నకిలీవి తయారుచేశాడు. వాటిని డోర్నకల్ రోడ్డులోని కోన మెడికల్స్ నిర్వాహకుడు కటికపూడి సంపత్కుమార్, గోవిందరాజులునాయుడు వీధిలోని జయశ్రీ మెడికల్ నిర్వాహకుడు పాలడుగుల వెంకట్ గిరీశ్కు విక్రయించాడు. గుంటూరుకు చెందిన ఓ కరోనా బాధితుడి బంధువులకు వీరు ఒక్కో ఇంజెక్షన్ను రూ.20 వేలకు అమ్మారు. గుంటూరు వైద్యులు వాటిని నకిలీవిగా గుర్తించి.. బాధితుడి బంధువులకు విషయం చెప్పారు. వారి సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని ముగ్గురినీ అరెస్టు చేశారు.