న్యూఢిల్లీ : ఈ ఏడాది నైపుణ్యాలకు డిమాండ్ పెరగడంతో ఐదు దేశీ ఐటి దిగ్గజాలు లక్షకు పైగా టెకీలను నియమించుకునేందుకు సన్నద్ధమయ్యాయి. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ఈ ఏడాది క్యాంపస్ ల నుంచి 40,000 మందిని రిక్రూట్ చేసుకునేందుకు యోచిస్తోంది. ఇక ఇన్ఫోసిస్ క్యాంపస్ ల నుంచి 25,000 మందిని హైర్ చేయనుండగా, మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో గత ఏడాది కంటే అధికంగా నియామకాలు చేపడతామని వెల్లడించింది. డిమాండ్ ఊపందుకోవడంతో పాటు గ్రోత్ రేటు ఊపందుకోవడంతో నైపుణ్యాలకు గిరాకీ పెరిగిందని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు ఇటీవల విశ్లేషకులతో పేర్కొనడం గమనార్హం.
ఈ ఏడాది టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహీంద్ర 1,10,000కు పైగా నియామకాలు చేపడతాయని స్టాఫింగ్ ఏజెన్సీ ఎక్స్ ఫెనో సహ వ్యవస్ధాపకుడు కమల్ కరంత్ పేర్కొన్నారు. తాజా నియామకాలతో పాటు ఉద్యోగుల నిష్క్రమణ రేటు అధికంగా ఉంటుందనే అంచనాలతో ఈ ఏడాది భారీగా హైరింగ్ ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు కంపెనీలు ఐటీ వ్యయాలను పెంచడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో భారీ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గుచూపుతాయని కమల్ కరంత్ పేర్కొన్నారు. మరోవైపు డీఎక్స్ సీ టెక్నాలజీ, మైండ్ ట్రీ వంటి కంపెనీలు సైతం టెకీల నియామకాలను చేపట్టనున్నాయి.