నిర్మల్ టౌన్, మార్చి 15: ఒకప్పుడు గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా డప్పు చాటింపు వేయించేవారు. పల్లెలో రేషన్ బియ్యం వచ్చినా, గ్రామసభ నిర్వహించాలన్నా, కరెంట్ బిల్లులు కట్టాలన్నా, గ్రామానికి ప్రజాప్రతినిధులు వచ్చినా.. అంతేందుకు గ్రామ పంచాయతీలో ఏ చిన్న కార్యక్రమం చేసినా గ్రామస్తులకు కబురు చేరాలంటే డప్పు చాటింపు వేయాల్సిందే. అందుకే ప్రతి గ్రామంలో డప్పు చాటింపునకు ఓ వ్యక్తిని నియమించుకునేవారు. ఇది నిర్మల్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న తంతు. గ్రామంలో డప్పు చాటింపు వేస్తే చాలు ప్రజలకు ఏదో కొత్త సమాచారం ఉందని తెలిసిపోతుంది. గ్రామ ప్రధాన కూడళ్లలో డప్పు చాటింపు వేస్తే ఆ కాలనీ వాళ్లంతా ఏం కబురోనని ఆసక్తిగా అడిగేవారు. కానీ ప్రస్తుతం సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డప్పు చాటింపన్నదే వినబడడం లేదు.
“గ్రామ ప్రజలకు తెలియ జేయునది ఏమనగా.. బియ్యం తీసుకోనోళ్లంతా బియ్యం తీసుకోవాలి. ఇయ్వాళ్లనే లాస్ట్..” అంటూ మైక్లో మాటలు వినిపిస్తున్నాయి. “గ్రామంలో మీటింగ్ ఉంది.. ఫలానా వాళ్లంతా తప్పకుండా రావాలి.. కరెంట్ బిల్లులు తీసుకొనేటోళ్లు అచ్చిండ్రు.. బిల్లు కట్టున్రి.. లేకుంటే కరెంటు కట్ చేస్తరు.. డాక్టరమ్మ వచ్చింది.. రోగాలు చూసి మందులిస్తరట..” ఇలా రకరకాలు మాటలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఎలాంటి కబురు ఇవ్వాలన్నా ఇప్పుడు ఢం..ఢం.. ఢం.. అనే దండోరా చప్పుడు స్థానంలో రికార్డు చేసిన మాటలు వినిపిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం మార్చ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో ప్రజలకు ఏ కబురు ఇవ్వాలన్నా రికార్డు మైక్ సెట్ను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రజలకు ఏ సమాచారం ఇవ్వాలో దాన్ని రికార్డు చేసి ప్రతి గల్లీలో మైక్ ద్వారా వినిపించడం షురూ చేశారు. ఇప్పుడు అదే మైక్ పల్లెలో సమాచార వస్తువుగా మారిపోయింది. డప్పుకు బదులు మైకు సెట్ వాడుతున్నారు.
జిల్లాలో396 గ్రామపంచాయతీలున్నాయి. ఇందులో 300 గ్రామ పంచాయతీల్లో మైక్సెట్ ద్వారా దండోరా నిర్వహిస్తున్నారు. రికార్డుల మైక్ సెట్ మార్కెట్లో రూ.600 నుంచి 1000 వరకు లభిస్తున్నది. కరెంట్ చార్జింగ్తో ఇది పనిచేస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే మూడు నుంచి నాలుగు గంటలు నిరంతరంగా రికార్డు చేసిన మాటలను వినిపిస్తుంది. దండోరా వేసే వ్యక్తి రికార్డు చేసిన మైక్సెట్తో గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతూ ఆ మాటలను ప్రజలకు వినిపిస్తున్నారు. దీంతో డప్పు కొట్టడానికి శ్రమించే అవసరం లేదు.. ప్రతి వీధిలో అరిచే పనిలేదు.. వీటితో చేయి, గొంతునొప్పి బాధలు తప్పాయని పలువురు పేర్కొంటున్నారు. గతంలో చాటింపు రోజుకు ఒకసారి చేసేవారు. ఇప్పుడు రెండుసార్లు చేస్తున్నారు. అప్పుడు పల్లె ప్రధాన కూడళ్లలోనే దండోరా వేసేవారు. ప్రజలు ఆ దండోరా వినడానికి సదరు కూడలికి వెళ్లేవారు. ఇప్పుడు గ్రామంలోని అన్ని ఇండ్లలో, సందుసందులో మైక్సెట్ ద్వారా దండోరా వినిపిస్తుండడంతో ఏ సమాచారమైనా ప్రజలందరికీ అందుతున్నది. గతంలో ఒక్కసారి చాటింపు వేసే వ్యక్తికి రూ.200 ఇచ్చేవారు. ఆ వ్యక్తి ఉంటేనే గ్రామంలో చాటింపు జరిగేది. ఇప్పుడు అ అవసరం లేకుండాపోయింది. ఏ వ్యక్తి అయినా ఆయన మాటలు రికార్డు చేసి ఊరంతా మైక్ ద్వారా మాటల దండోరా వేసే అవకాశం కలిగిందని సర్పంచ్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
గ్రామంలో ప్రజలకు ఏ కబురు చెప్పాలన్నా దండోరా వేసే వ్యక్తిని పిలిచి వేయించే వాళ్లం. ఇందుకు రూ.200 ఇచ్చేవాళ్లం. ఒక్కొక్కసారి మనిషి దొరకక ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ ద్వారా రికార్డు మైక్ సెట్ కొన్నాం. ప్రజలకు ఏ కబురు చెప్పాలన్నా మైక్సెట్లో రికార్డు చేసి ఊరంతా మనిషితో తిప్పిస్తున్నాం. దీంతో గ్రామ పంచాయతీకి ఖర్చు కూడా తగ్గింది. గతంలో నెలకు రూ.1000 ఖర్చు అయ్యేది. ఆ డబ్బులతో ఒకసారి మైక్సెట్ కొంటే యేండ్ల తరబడి పనికొస్తుంది.
– ఖానిష్ ఫాతిమా, సర్పంచ్, ఓల
నేను 10 యేండ్ల నుంచి దండోరా వేస్తున్నా. డప్పుతో దండోరా వేయడం వల్ల చేతులు నొప్పి పెట్టేవి. అందరికీ కబురు అందాలని బిగ్గరగా అరిచి చెప్పడం వల్ల గొంతునొప్పి వచ్చేది. ప్రధాన కూడళ్లలో డప్పు చాటింపు వేయడం వల్ల లోపల ఉన్న వారు తిరిగి వచ్చి ఏం దండోరా అని నన్ను అడిగేవారు. వారందరికీ ఆ విషయం చెప్పాలంటే ఇబ్బంది కలిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సారి విషయాన్ని మైక్సెట్లో రికార్డు చేసి ఊరంతా వినిపించేలా ఇది ఉపయోగపడుతున్నది.
– రాములు