హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తున్నది. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర, ఉజ్జయిని డ్యాంలను నిండుకుండల్లా మార్చి దిగువకు ఉరకలేస్తున్నది. శనివారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల వరద నమోదైంది. అధికారులు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి వచ్చే నీటితోపాటు తుంగభద్ర జలాలతో కలిసి శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 59వేల ఇన్ఫ్లో నమోదవుతున్నది. ఒక్క రోజులోనే రిజర్వాయర్లో ఐదు అడుగుల మేర నీటినిల్వ పెరిగింది. మూసీ నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నాగేందర్రావు ప్రాజెక్టును సందర్శించి నీటి విడుదలను, గేట్ల విడిభాగాలను పరిశీలించారు. గేట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద ఉద్ధృతి కొనసాగుతున్నది.
గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి బరాజ్కు గోదావరి, మానేరు నదుల నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 6,719 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 18.645 టీఎంసీల నీరున్నది.