మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటి విడుదలను ప్రారంభించారు. బుధవారం శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు రెండు గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని సాగర్కు వదిలారు. ఎగువ నుంచి జూరాల, సుంకేశుల ద్వారా దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల భారీ వరద శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతున్నది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. శ్రీశైలం నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు, భక్తులు కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. 2007 తర్వాత మళ్లీ జూలై నెలలోనే శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా ఉత్పత్తి చేపట్టారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. 3,81,990 ఇన్ఫ్లో ఉండగా.. 41 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 3,82,325 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.