హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేస్తూ స్టంట్లు చేస్తూ డ్రామా ఆర్టిస్టుగా మారాడని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. ఆయన మాటల్లో చూపిస్తే తాము చేతల్లో చూపిస్తామని మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై ఇష్టారీతిగా మాట్లాడితే నాలుక కోస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి భాష మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. ఇష్టారీతిగా మాట్లాడిన కేంద్రమంత్రి నారాయణరాణేను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఇక్కడ ఇన్నేసి మాటలు అంటున్న రేవంత్ను ఏం చేయాలని నిలదీశారు. రేవంత్ది మాటలు, మూటల సంస్కృతి అని, కాంగ్రెస్లో దొరికింది దోచుకోవటమే ఆయన పని అని ఆరోపించారు. ఆ పార్టీలోని సీనియర్లూ ఆయన వ్యవహారశైలిపై మండిపడుతున్నారని చెప్పారు. తాడు బొంగురంలేని కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్ల అనే ఉద్దేశంతోనే ప్రగతిభవన్కు బీఆర్ అంబేద్కర్ బహుజనభవన్ అని పేరుపెడతానని బీరాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ప్రగతిభవన్ కేంద్రంగా పాలన సాగిందని, ఆ సమయంలో ఆ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ అన్నివర్గాలకు అన్యాయం చేసింది కాబట్టే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నారని.. అలాంటిది వందమంది ఎమ్మెల్యేలు ఒక్కసారి లేస్తే పాతాళానికి వెళ్లడం ఖాయమని జీవన్రెడ్డి తెలిపారు. ‘రేవంత్ తొక్కుతా అంటే తాము కొడుకా అని అనగలం కానీ, మాకు సంస్కారం అడ్డు వస్తున్నది’ అని అన్నారు. రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్కు ఉన్న కొద్దిపాటి అడ్రస్ కూడా గల్లంవుతుందని, ఆయన పద్ధతిని మార్చాలని కోరుతూ రాహుల్గాంధీకి లేఖ రాశానని పేర్కొన్నారు. ప్రపంచానికి తన విజ్ఞానంతో దేశ ప్రతిష్ఠను ప్రత్యేకించి తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడుతున్న సత్యనాదెండ్ల ఎవరో తెలియని మూర్ఖుడు, అజ్ఞాని రేవంత్రెడ్డి అని జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి ఈవెంట్ మేనేజర్లాగా, డ్రామా ఆర్టిస్ట్లాగా.. జోకర్లాగా మారాడని కాంగ్రెస్ నేతలే పేర్కొంటున్నారని చెప్పారు. రేవంత్.. చంద్రబాబు పెంపుడు కుక్క అని ఆరోపించారు. సమాజంలో అన్నివర్గాల ఆర్థిక, సామాజిక మార్పు కోసం సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించే సరికి కాంగ్రెస్, బీజేపీలకు మైండ్బ్లాంక్ అయిందని చెప్పారు. రేవంత్ తన పర్యటనలో దళితుల ఇండ్లలో నిద్రచేసి వాళ్ల ఇంట్లో నీళ్లు కాకుండా కిన్లే వాటర్ తాగి దళిత సమాజాన్ని అవమానపరిచారని ఆరోపించారు.