కరీంనగర్ : ఓట్ల కోసం అబద్ధాలు చెబుతున్న బీజేపీ నేత ఈటల రాజేందర్కు బుద్ధి చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొప్పుల హాజరయ్యారు. అంతకుముందు పట్టణానికి చేరుకొన్న మంత్రికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనామకుడిగా పార్టీలో చేరిన ఈటలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారని, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవకాశమిచ్చారని చెప్పారు. ఇంతచేసినా అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టడం ఈటలకే చెల్లిందన్నారు. ఆత్మగౌరవం, ధర్మం, న్యాయం అంటూ చెప్పే ఆయన వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో, పేద దళితుల భూములు ఎందుకు గుంజుకున్నాడో చెప్పాలని ప్రశ్నించారు.
ఓటమి ఖాయమని తేలడంతోనే ఈటల గోడ గడియారాలు పంచిపెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని, అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్నే ఆదరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, వార్డు కౌన్సిలర్లు మల్లయ్య, లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్ చిన్నారులు