హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భూములు, పట్టాదారు పాస్పుస్తకాల చట్టంకింద కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఏర్పాటు స్ఫూర్తిని అర్థం చేసుకోగలమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ కేసులను సత్వరంగా పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయం అభినందనీయమని కొనియాడింది. సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయంటే కోర్టులు కూడా సంతోషిస్తాయని చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసం అభిప్రాయపడింది. ట్రిబ్యునళ్లలో వాదించేందుకు లాయర్లకు అవకాశం కల్పించలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. ట్రిబ్యునళ్లలో కేసులను హడావుడిగా విచారించవద్దని, పరిష్కారమైన కేసుల్లో అభ్యంతరాలు ఉంటే తిరిగి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ట్రిబ్యునళ్లకు 16,296 కేసులను బదిలీ చేశామని అందులో 1,859 కేసుల్లో లాయర్లు కూడా హాజరై వాదనలు వినిపించారని తెలిపారు. లాయర్లకు వాదించే అవకాశం ఇవ్వడం లేదని పిటిషనర్ చేస్తున్న వాదనల్లో నిజం లేదన్నారు. ట్రిబ్యునళ్లు సహజన్యాయసూత్రాలకు లోబడి తీర్పునివ్వాలని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ట్రిబ్యునళ్లలో పరిష్కారమైన కేసులు, లాయర్లు వాదించిన కేసులు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా పరిష్కరించిన కేసుల వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది.