డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ
పోలింగ్ కేంద్రాలకు జంబో బ్యాలెట్ పేపర్, బాక్స్ల తరలింపు
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకుభారీ పోలీస్ బందోబస్తు
కొవిడ్ నిబంధనలతో ఎన్నికల నిర్వహణ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
వికారాబాద్/రంగారెడ్డి, మార్చి 13, (నమస్తే తెలంగాణ):హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శనివారం డి్రస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేయగా, వారికి కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. బరిలో 93 మంది అభ్యర్థులు ఉండడంతో జంబో బ్యాలెట్ పేపర్, బాక్స్లను అందజేశారు. ఇప్పటికే పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేయగా, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు పోలింగ్ జరుగనుంది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం వరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. ఈ ఎన్నికల బరిలో 93 మంది ఉన్న దృష్ట్యా 219 జంబో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
250 బిగ్ బాస్కెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1080 మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరిలో 220 మంది పీవోలు, 220 మంది ఏపీవోలు, 440 మంది ఓపీవోలున్నారు. 200మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో 33 రూట్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయగా, 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.
ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు…
జిల్లాలో 1,40,968 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 88,388 మంది, మహిళలు 52,594 మంది, ఇతరులు 16 మంది ఓటర్లున్నారు. షాద్నగర్ డివిజన్లో 12 పోలింగ్ కేంద్రాలుండగా 9356 మంది, వీరిలో పురుషులు 6221, మహిళలు 3134, ఇతరులు ఒకరున్నారు. చేవెళ్ల డివిజన్లో 9 పోలింగ్ కేంద్రాలుండగా మొత్తం ఓటర్లు 8125 మంది ఉండగా వీరిలో పురుషులు 5615, మహిళలు 2510 మంది ఓటర్లున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో 15 పోలింగ్ కేంద్రాలుండగా మొత్తం ఓటర్లు : 29,357 మంది ఉండగా పురుషులు 18,588, మహిళలు 10,766, ఇతరులు ముగ్గురు ఉన్నారు. రాజేంద్రనగర్ డివిజన్లో 28 పోలింగ్ కేంద్రాలుండగా మొత్తం 42,241 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 26,054, మహిళలు 16,180, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కందుకూరు డివిజన్లో 55 పోలింగ్ కేంద్రాలుండగా మొత్తం 51,889 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషలు 31,880, మహిళలు 20,004, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు జరుగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకున్న సిబ్బంది పంపిణీ కేంద్రంలో రిపోర్టు చేశారు. మధ్యాహ్నం వరకు ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు పర్యవేక్షణలో అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య ఏర్పాట్లను పరిశీలించారు. 93 మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో జంబో బ్యాలెట్ పత్రం ముద్రించారు.200 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు. 38 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయనున్నారు. వీరితో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించారు.
38 పోలింగ్ కేంద్రాలు..
ఐదు నియోజకవర్గాల్లో 19 లొకేషన్ల పరిధిలో 38 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, 9 మంది సెక్టార్ అధికారులు, 38 మంది బీఎల్వోలు, 17 మంది నోడల్ ఆఫీసర్లు, 24 మంది మైక్రోఅబ్జర్వర్లు ఉండగా.. 20 శాతం అదనంగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు 45 మంది పీవో, 45 మంది ఏపీవోలు, 9 రూట్లు, 9 జోన్లలో 72 కిలోమీటర్ల దూరంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 38 పోలింగ్ కేంద్రాల వద్ద 38 వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చే శారు. మొత్తం 180 ఎన్నికల సిబ్బంది, 261 పోలీస్ సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు, 18 మండలాల తాసిల్దార్లు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు.
ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ పౌసుమి బసు
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..18 మండలాల్లో 38 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 25,958 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది అందించిన పెన్నుతోనే ఓటు వేయాలని, వేరే పెన్నుతో ఓటు వేస్తే చెల్లదని స్పష్టం చేశారు. పోలింగ్ పూర్తైన వెంటనే బ్యాలెట్ బ్యాక్స్లకు సీల్ వేసి కేటాయించిన బస్సుల్లో సంబంధిత రూట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బాక్స్లను సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించాలని తెలిపారు. అంతకు ముందు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకులు హరిప్రీత్సింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకుని సామగ్రి పంపిణీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి మోతీలాల్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, జీఎం డీఐసీ వినయ్కుమార్, తాసిల్దార్ రవీందర్ పాల్గొన్నారు.