మహబూబ్నగర్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసింది. గత మూడు రోజులుగా నామినేషన్లను స్వీకరించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీకి వచ్చిన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. తొలిరోజు నామినేషన్ల దాఖలు నిల్ కాగా రెండో రోజు 19, చివరిరోజైన ఆదివారం భారీగా 222 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల నామినేషన్లు కలిపి మొత్తం 241 దాఖలయ్యాయి. పార్టీల వారీగా టీఆర్ఎస్-63, కాంగ్రెస్-43, బీజేపీ-42, సీపీఐ-4, సీపీఎం-1, ఎంఐఎం-9, ఇండిపెండెంట్లు-79 నామినేషన్లు దాఖలయ్యాయి.