కోపంతో కండ్లు ఎరుపెక్కడం మామూలే. కానీ, ఎరుపెక్కిన కండ్లు వాటి లోపలి సమస్యను కూడా సూచిస్తాయంటున్నారు నిపుణులు. కంటి పొరల్లో ఉండే రక్తనాళాలు చిట్లినప్పుడు కండ్లు ఎర్రగా మారుతాయి. రక్తనాళాల నుంచి లీక్ అయిన రక్తం కంటి పొరల కింద చేరడం వల్ల ఎర్రగా కనిపిస్తాయి. దీన్ని సబ్ కంజంక్టివల్ హెమరేజ్ అంటారు. విడుదలైన రక్తం చాలా తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కంటికీ, దృష్టికీ ఏ ప్రమాదమూ ఉండదు. రెండు వారాలు దాటాక కూడా కంటిలో ఎరుపుదనం తగ్గకపోయినా, దృష్టి సమస్యలు ఎదురైనా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కండ్లపై ఒత్తిడి ఎక్కువగా పడినప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కండ్లు నలిపినా, తీవ్రమైన దగ్గు, తుమ్ములు వచ్చినా ఇలా రక్తనాళాల్లో రక్తం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు చాలా సులభంగా సబ్కంజంక్టివల్ హెమరేజ్కి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే కండ్లపై ఒత్తిడి పడనీయకుండా జాగ్రత్తపడాలి.