పెద్దపల్లి : న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసు నిందితులను మంగళవారం పోలీసులు మంథని కోర్టులో హాజరుపర్చారు. నిందితులు ముగ్గురిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ వరంగల్ జైలు నుంచి మినీ బస్సులో కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిందితులు కుంట శ్రీనివాస్, శివనందుల చిరంజీవి, అక్కపాక కుమార్లను వేర్వేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను వరంగల్ జైలుకు తరలించారు. మీడియాకు చిక్కకుండా పోలీసులు నిందితులను కోర్టులోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో బస్సు కోర్టు ప్రహరీని ఢీకొట్టడంతో అద్దం ధ్వంసమైంది. కోర్టు వద్ద భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. గత నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద వామన్రావు దంపతులను వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ కేసులో కుంట శ్రీను, కుమార్, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.