జగిత్యాల/మల్యాల : జిల్లాలోని మల్యాల మండలంలో నూకపల్లి గ్రామశివారులో ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం జీ+1 తరహాలో నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ..రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్ సమర్థవంతమైన పాలనతో గణనీయంగా అభివృద్ధి సాధించిందన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడినప్పటికి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు.
అలాగే రామాన్నపేట, పోతారం గ్రామాల లబ్ధిదారులకు సైతం డబుల్ ఇండ్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి, జిల్లా పరిషత్ చైర్మన్ దావా వశంత, మండల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.