అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు
కౌన్సిలర్లు పారిశుధ్య పనులు పరిశీలించాలి
ప్రధాన రహదారుల్లోని ఇండ్లపై వర్షం నీరు కూడా వెళ్లేలా యూజీడీ ప్లాన్ను మార్చండి
రోడ్ల అభివృద్ధిలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు
మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 15 ట్రాన్స్ఫార్మర్లు, 500ల స్తంభాలు
పిడిచెడ్ రోడ్డులో బట్టర్ ఫ్లై విద్యుత్ దీపాల ఏర్పాటు
మున్సిపల్ చట్టానికి అనుగుణంగా ఇండ్లు నిర్మించాలి
రింగురోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్షలోమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 3 : గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు వేగిరం చేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై ఐవోసీలో ‘గడా’ సమావేశ మందిరంలో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గజ్వేల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఇండ్లపై పడే వర్షం నీరు పోయేలా యూజీడీ పనుల్లో మార్పులు చేయాలన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం భవన నిర్మాణాలు జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని,రింగ్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, పాలకవర్గం, అధికారులు సమన్వయంతో మరింత అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఐవోసీలో ‘గడా’ సమావేశమందిరంలో శనివారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గజ్వేల్లో పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నా, డంపింగ్యార్డులో మాత్రం ఒకేచోట వేస్తున్నారని, చెత్తను కాల్చివేయడంతో కాలుష్యం ఏర్పడుతుందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్, ఎరువుల తయారీకి వినియోగించాలని సూచించారు. కౌన్సిలర్లు వాడవాడలా తిరిగి పారిశుధ్య పనులు పరిశీలించాలన్నారు.
యూజీడీ పనుల్లో మార్పులు చేయాలి..
మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయాలని ఎంపీ నిర్మాణ సంస్థకు సూచించారు. ప్రధాన రహదారుల్లోని ఇండ్లపై నుంచి వచ్చే వర్షం నీరు కూడా వెళ్లేలా నిర్మించేందుకు యూజీడీ ప్లాన్ను మార్చాలని సూచించారు. ఆర్అండ్బీ, విద్యుత్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని తెలిపారు. 5, 11, 17 వార్డుల కౌన్సిలర్లు చందన రవి, లక్ష్మీ కిషన్రెడ్డి, శ్యామల మల్లేశం విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 15ట్రాన్స్ఫార్మర్లు, 500 స్తంభాలు వెంటనే ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని డీఈ శ్రీనివాసచారిని ఆదేశించారు. ఎస్సీ కాలనీ నుంచి పిడిచెడ్ రోడ్డులో బట్టర్ ఫ్లై విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
చట్ట ప్రకారం భవన నిర్మాణం చేపట్టాలి..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చట్టానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. పలు పట్టణాల్లో గతంలో నిబంధనలు పాటించకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో వాహనాలు వెళ్లేందుకు సరైన రోడ్లు కూడా లేవన్నారు. అలాంటి పరిస్థితులు గజ్వేల్లో తలెత్తకుండా ఉండాలంటే సెట్బ్యాక్ (అభివృద్ధి కోసం 10శాతం స్థలం) జరిగి భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు స్థానిక కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గజ్వేల్ చుట్టూ 22కిలోమీటర్ల గాను 4కిలోమీటర్ల మేర రింగురోడ్డు నిర్మాణం పెండింగ్ ఉందని, వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గజ్వేల్ దవాఖానను అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. దవాఖానలోని పరిసరాలు, పరికరాలు అన్ని పటిష్టంగా ఉండేలా ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ను పర్యవేక్షించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య, సీనియర్ నాయకులు యాదవరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, ఆర్అండ్బీ, విద్యుత్ డీఈఈలు బాలప్రసాద్, శ్రీనివాసాచారి, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.