విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం త్వరలో ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది. మరోవైపు టీమ్ఇండియా వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంకలో పర్యటించనుంది. లంక టూర్కు కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండరు. శ్రీలంక పర్యటనకు పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతోనే మరో టీమ్ను ఎంపిక చేసి లంకకు పంపనున్నారు. లంకలో పర్యటించే భారత జట్టుకు నాయకత్వం వహించే ఆటగాడు ఎవరనేదానిపై ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది.
కెప్టెన్సీ రేసులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉంటారని భారత మాజీ వికెట్ కీపర్ దీప్దాస్ గుప్తా తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనకు భువీ ఎంపికకాకపోవడంపై తానేమీ ఆశ్చర్యపోలేదని, లంకతో పరిమిత ఓవర్ల సిరీస్కు అనుభవజ్ఞుడైన సీనియర్ పేసర్ అందుబాటులో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అందుబాటులో లేరు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావనే. కాబట్టి శిఖర్కు కెప్టెన్సీ అప్పగిస్తారని నేను భావిస్తున్నాను. భువీ ఫిట్ ఉండి, ఆడటానికి సిద్ధంగా ఉంటే అతడు కూడా సారథిగా బాధ్యతలు నిర్వర్తించడానికి అర్హుడేనని’ దాస్గుప్తా అన్నాడు.