సమైక్య రాష్ట్రంలో సబ్రిజిస్ట్రార్లు స్థానికంగా తమకు తోచిన విధంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా భూముల విలువలను, రిజిస్ట్రేషన్ చార్జీలను నిర్ణయించేవారు. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలను బట్టి చార్జీలను స్థానిక సబ్రిజిస్ట్రార్ ప్రతిపాదనల మేరకు సవరించేవారు. ఇదంతా అశాస్త్రీ యంగా జరిగేది. ఇప్పుడు ఎక్కడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా సవరణచేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను వాటి ప్రస్తుత ధర ప్రకారం వర్గీకరించి నిర్ణ యించారు. ఇందులో నూ ప్రస్తుత విలువను సగటున లెక్కగట్టి నిర్ధారించారు.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూముల విలువలను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకొన్నది. ఈ నెల 22 నుంచి కొత్త విలువలు, చార్జీలు అమల్లోకి వస్తాయి. ఎనిమిదేండ్ల తర్వాత రాష్ట్రంలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 22వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకొని, స్టాంప్ డ్యూటీ చెల్లించినవారికి కూడా పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొన్నది. ఇందుకోసం ధరణిలో ‘అడిషనల్ పేమెంట్స్ ఫర్ స్లాట్స్ ఆల్రెడీ బుక్డ్’ అనే అప్షన్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆప్షన్లోకి వెళ్లి అదనపు చార్జీలు చెల్లించాలని సూచించింది. సందేహాల నివృత్తికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఇందుకోసం 18005994788 నంబర్కు కాల్ చేయాలని, అలాగే ascmro@telangana.gov.in కు మెయిల్ చేయాలని తెలిపింది.
చార్జీల పెంపులో గతంలో ఎన్నడూ లేని విధంగా హేతుబద్ధత పాటించారు. సమైక్య రాష్ట్రంలో సబ్రిజిస్ట్రార్లు స్థానికంగా తమకు తోచిన విధంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా భూముల విలువలను, రిజిస్ట్రేషన్ చార్జీలను నిర్ణయించేవారు. అవే అంతిమంగా అమలయ్యేవి. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలను బట్టి చార్జీలను స్థానిక సబ్రిజిస్ట్రార్ ప్రతిపాదనల మేరకు సవరించేవారు. ఇదంతా అశాస్త్రీయంగా జరిగేది. ఇప్పుడు ఎక్కడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా సవరణచేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను వాటి ప్రస్తుత ధర ప్రకారం వర్గీకరించి నిర్ణయించారు. ఇందులోనూ ప్రస్తుత విలువను సగటున లెక్కగట్టి నిర్ధారించారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను మూడు శ్లాబులుగా (50, 40, 30 శాతాలుగా) పెంచారు. గతంలో మార్కెట్ విలువ ఒక్కొక్కచోట ఒక్కో రకంగా ఉండేది. ఇప్పుడు కనిష్ఠంగా ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అన్నింటా ఏకరీతిలో చార్జీల పెరుగుదల ఉంటుంది. ఓపెన్ ప్లాట్ల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అనుసరించారు. చదరపు గజానికి కనీసధర గతంలో రూ.100 ఉండేది. ఇప్పుడు దీన్ని కనిష్ఠంగా రూ.200 పెంచింది. ఇక్కడ కూడా 50, 40, 30 శాతాలుగా మూడు శ్లాబుల్లో మార్కెట్ విలువలను పెంచారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా అసలు ధర రూ.100 చదరపు గజానికి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనిష్ఠ ధరలను పెంచారు. అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.800 ఉండగా దీన్ని రూ.వెయ్యికి పెంచారు. చదరపు అడుగుపై 20, 30 శాతం చొప్పున స్థూలంగా చార్జీలను పెంచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు.. 2013 ఏప్రిల్ ఒకటిన అప్పటి ప్రభుత్వం సవరించిన భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపే ఆఖరు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం.. ఏడేండ్లుగా విలువల పెంపు, చార్జీల పెంపును చేపట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై భారం పడొద్దని ఇప్పటివరకు చార్జీల సవరణ చేపట్టలేదు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రతిఏటా భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్చార్జీల పెంపు చేపడుతూనే ఉన్నారు. ఇటీవలే అక్కడ స్టాంప్డ్యూటీని 7.5% పెంచారు. తమిళనాడులో స్టాంప్డ్యూటీ 11% వరకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత అనేకరంగాల్లో అద్భుతమైన వృద్ధి సాధించింది. రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తున్నది. దీంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటుతో కూడా భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు పూర్తి కావడంతోపాటు రీజనల్ రింగ్రోడ్డు ఏర్పాటు, రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అవతరించడం, ప్రత్యేకంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు రావడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఈ పరిణామాలన్నింటివల్ల గడిచిన ఏడేండ్లలో భూముల క్రయ, విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలను సవరించింది.
మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించే ప్రతిపాదనలపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఆ శాఖ అధికారులు కొన్ని నెలలుగా మెరుగైన పద్ధతిని అవలంబించడంపై దృష్టి పెట్టారు. సామాన్యులకు ఎట్టి పరిస్థితుల్లోను రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు భారం కావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పడంతో దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వం భారీ గా చార్జీలు పెంచుతుందని చాలామంది భావించారు. కానీ, ఎక్కడా గతంలోఉన్న విలువలకు/చార్జీలకు 50 % మించకుండా చూశారు. సెంట్రల్ వాల్యూయేషన్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకే పెంచారు. జిల్లాస్థాయిల్లో కూడా ప్రతిపాదనలను తెప్పించుకొని కసరత్తు చేసి రాష్ట్రం మొత్తానికి ఒకే తరహా విధానాన్ని తీసుకొచ్చారు.
రిజిస్ట్రేషన్ చార్జీల్లో గతంలో పంచాయతీల పరిధిలో 1.5 శాతం ట్రాన్స్ఫర్ ఫీజు ఉండేది. దీన్ని పూర్తిగా రద్దుచేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పట్నుంచి ఇది ఉండేది. కొత్త పంచాయతీచట్టం అమలు తర్వాత ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తుండటంతో ఈ ట్రాన్స్ఫర్ ఫీజును రద్దుచేశారు. మరోపక్క పంచాయతీల్లో గతంలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది. ప్రస్తుతం దీన్ని రెండుశాతం చేశారు. స్టాంప్డ్యూటీని 5.5 శాతానికి పెంచారు. మొత్తంగా రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్డ్యూటీ కలిపి 7.5 శాతానికి చేరుకున్నది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఈ పెంపు తక్కువే.