తెలంగాణలో 2013 నుంచి భూమి విలువ పెంపు, చార్జీల సవరణ చేయలేదు. పొరుగు రాష్ట్రం ఏపీలో స్టాంప్డ్యూటీని 7.5 శాతానికి పెంచడమే కాకుండా, పలుసార్లు భూముల విలువను సవరించారు. తమిళనాడులో 7.5%, మహారాష్ట్రలో 7% రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయి. మన దగ్గర 6%గా ఉన్నది. దీన్ని కనీసం 7%కి పెంచాలని ఉన్నతాధికారులు సిఫారసుచేశారు. రాష్ర్టావిర్భావం నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ వస్తున్నది. దీంతోపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగింది. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాల్లో సాగుభూముల ధరలకూ రెక్కలొచ్చాయి.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థిరాస్తుల విలువ పెంచాలని, రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని వనరుల సమీకరణ (రిసోర్స్ మొబిలైజేషన్)పై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ విలువ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువగా ఉండటంతో భూములు, ఇండ్లు కొనేవారికి పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని సబ్కమిటీ అభిప్రాయపడింది. బ్యాంకు రుణాలు రావడంలో కొన్ని పరిమితులుంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు.. పెరిగిన విలువకు అనుగుణంగా సవరణలు చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నది. ఆర్థికమంత్రి టీ హరీశ్రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది. మంత్రులు కే తారకరామారావు, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి, జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాసులుతోపాటు వివిధ శాఖల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలమీద భారం పడకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే అవకాశాలపై ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ఉపసంఘం.. మంగళవారం భూముల విలువ సవరణపై చర్చించింది. తెలంగాణలో 2013 నుంచి భూమి విలువ పెంపు, రేట్ల సవరణ కానీ చేయలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో స్టాంప్డ్యూటీని 7.5 శాతానికి పెంచి, పలుసార్లు భూముల విలువను సవరించారు. తమిళనాడులో 7.5%, మహారాష్ట్రలో 7% రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయి. మన దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు 6%గా ఉన్నది. (మొత్తం భూమి విలువలో స్టాంప్ డ్యూటీ 4%, ఆస్తుల బదిలీ సుంకం 1.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%). ఈ ఫీజును కనీసం 7%కి పెంచాలని అధికారులు సిఫారసు చేశారు. భూముల విలువ, రిజిస్ట్రేషన్ల చార్జీలను ఏవిధంగా సవరించాలన్న అంశంపై వివిధ శాఖల అధికారులతో సబ్కమిటీ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో నెలకొన్న సానుకూలతల వల్ల భూముల విలువ భారీగా పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.
మార్కెట్ వాల్యూకు.. బుక్వాల్యూకు తేడా
వాస్తవానికి ప్రభుత్వం నిర్ణయించిన బుక్వాల్యూ ప్రకారం ఒక ధర ఉంటే, బహిరంగ మార్కెట్ ధర మరో విధంగా ఉంటుంది. చాలా ప్రాంతాలలో ఈ రెంటి మధ్య వ్యత్యాసం కనీసం నాలుగు రెట్లు ఉంటుంది. ఉదాహరణకు మియాపూర్లో బహిరంగ మార్కెట్ విలువ చదరపు గజానికి సగటున రూ.40 వేల నుంచి రూ.60 వేలు ఉంటే బేసిక్ బుక్వాల్యూ రూ.10 వేల నుంచి రూ. 20 వేలు ఉంటుంది. కూకట్పల్లి అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు వెయ్యినుంచి రూ.2 వేలు ఉంటే బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.4 వేల నుంచి రూ.6 వేలు ఉంటున్నది. దీంతో బ్యాంకు రుణాలు, ఆదాయ పన్ను చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించారు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కంటే.. అధిక మొత్తాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నప్పటికీ, చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువలకే రిజిస్ట్రేషన్ చేసుకొంటున్నారని తెలిపారు. ఇప్పటి దాకా ప్రజలపై భారం పడకూడదన్న భావనతో ప్రభుత్వం భూముల విలువను సవరించలేదు. కానీ, చట్టం ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరమున్నదని అధికారులు మంత్రులకు తెలియజేశారు.
పూర్తయిన కసరత్తు
స్థిరాస్తుల విలువను బహిరంగ మార్కెట్తో హేతుబద్ధీకరించి రిజిస్ట్రేషన్ చార్జీలను ఏ మేరకు సవరించాలన్న విషయంపై అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర స్థాయిలో విలువల సవరణపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారని తెలిసింది. మూడు నెలలపాటు క్షేత్రస్థాయిలో అధ్యయనంచేసి భూముల విలువల్లో హెచ్చుతగ్గులను సవరించి హేతుబద్ధీకరించారు. బహిరంగ మార్కెట్లో వాస్తవంగా ఉన్న భూముల విలువలను ప్రామాణికంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చార్జీల సవరణకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రధాన రోడ్లు , వాణిజ్య ప్రాంతాల్లో తప్ప నివాసిత ప్రాంతా లు, పేదల బస్తీల్లో ఎక్కువ విలువ పెరుగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. బహిరంగ మార్కెట్ విలువను కుదించి కనీస స్థాయిలోనే పన్ను ఉండేలా ప్రతిపాదించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో ఉన్న మొత్తం విలువలో 30 నుంచి 40 శాతం విలువను బుక్వాల్యూగా తీసుకోవాలని అధికారులు ప్రతిపాదించారు. మార్కెట్ విలువలపై మరో నాలుగు రోజుల్లో జిల్లాల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రానున్నాయి. సమగ్ర నివేదిక రాగానే క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రికి సమర్పిస్తుంది. ఆ తర్వాత భూముల విలువ పెంపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నది.
హైదరాబాద్లో సమస్యలు
రిజిస్ట్రేషన్ ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హెచ్ఎండీఏ పరిధిలో భారీ మొత్తంలో భూములు, ఆస్తుల విలువలు పెరిగిన విషయం సబ్ కమిటీ చర్చించింది. భారీ పెట్టుబడులు, నగర విస్తరణ వల్ల రియల్ బూమ్ వచ్చిందని అధికారులు మంత్రులకు చెప్పారు. 2019- 20లో 51% లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ విలువ.. మారెట్ రేట్ల కంటే చాలా తకువగా ఉండటంతో స్థిరాస్తులను కొనే ప్రజలకు బ్యాంకు రుణాలు పరిమితంగా వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఇబ్బందులను తొలిగించడానికి.. పెరిగిన విలువకు అనుగుణంగా చాలాకాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువ సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉన్నదని క్యాబినెట్ సబ్కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను సీఎం కేసీఆర్కు అందించాలని నిర్ణయం తీసుకొన్నది.