20 నుంచి అమలు నేడో, రేపో మార్గదర్శకాలు
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించనున్నది. ఈ నెల 20 నుంచి భూముల విలువ సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు అమల్లోకి రానున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను సవరించాలని నిర్ణయించింది. ఏఏ ప్రాంతాల్లో ఎంత విలువ పెంచాలి? ఎంత సవరించాలి? అనే కసరత్తు ఇప్పటికే పూర్తయింది. క్యాబినెట్ సబ్కమిటీ కూడా భూముల విలువ సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భూముల విలువల సవరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాలవారీగా భూముల విలువ పెంచడం, కొన్నిచోట్ల సవరించినట్టు సమాచారం. భూముల విలువను 50 నుంచి 100 శాతం వరకు ఆయా ప్రాంతాలను బట్టి సవరించినట్టు తెలిసింది. ఈ సవరణలను 20వ తేదీ నుంచి అమలు చేయడానికి మంగళవారం క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నది.