హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి ప్రాథమిక సర్వే పూర్తయిందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) ప్రకటించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఎన్హెచ్ఎస్ఆర్సీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సోమవారం థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) సమక్షంలో ఇందుకు సంబంధించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సర్వేలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించినట్టు తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య 649.76 కిలోమీటర్ల దూరం నిర్మించే రైల్వేలైన్ మొత్తం గ్రీన్ కారిడార్గా ఏర్పాటుచేస్తామని చెప్పారు. అందుకు సంబంధించి డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కోసం సర్వే జరుగుతున్నదని వెల్లడించారు. బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైతే హైదరాబాద్-ముంబై మధ్య ప్రస్తుతం ఉన్న రైలు ప్రయాణ సమయం 14 గంటల నుంచి మూడు గంటలకు తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి ముంబై వరకు మొత్తం పది స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు. నవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పంధార్పూర్, సోలాపూర్, థానే, గుల్బర్గా, వికారాబాద్, హైదరాబాద్ ఉంటాయని తెలిపారు. ఈ రైల్వే కారిడార్ మొత్తం ప్రధానమైన ఎక్స్ప్రెస్ హైవేలు, జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ ప్రాంతాలను కలుపుతూ ఉంటుందని వివరించారు. దీనివల్ల వ్యాపారం, పర్యాటకం అభివృద్ధి చెందుతాయని తెలిపారు.