న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీకి భారీ కుదుపులు తప్పేలా లేవు. స్ధానిక లాక్డౌన్ లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలకు పలు సంస్థలు కోత పెడుతున్నాయి. జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ఇప్పటికే వృద్ధి రేటు అంచనాను కుదించగా తాజాగా అంతర్జాతీయ రేటింగ్స్ దిగ్గజం మూడీస్ సైతం 2021-22లో భారత వృద్ధి రేటు అంచనాను 13.7 శాతం నుంచి ఏకంగా 9.3 శాతానికి తగ్గించింది.
ఇక భారత్ కు నెగెటివ్ అవుట్ లుక్ తో కనిష్ట ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బీఏఏ3ని పునరుద్ఘాటించింది. భారత్ కు ఇప్పట్లో రేటింగ్స్ అప్ గ్రేడ్ ఉండబోదని తేల్చిచెప్పింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ తో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను సైతం 7.9 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించినట్టు మూడీస్ పేర్కొంది.