న్యూఢిల్లీ : దేశాన్ని కరోనా వణికిస్తోంది. పెద్ద సంఖ్యలో జనం మహమ్మారితో మృత్యువాతపడుతున్నారు. ఈ సమయంలో వారి మృతదేహాలను తీసుకునేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మృతులకు అంతిమ సంస్కారాల నిర్వహణ విషయంలో అవమానకరమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) కేంద్రం, రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. మరణించిన వారి గౌరవ ప్రతిష్ఠలు కాపాడేలా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం సామూహికంగా అంత్యక్రియలు జరగకుండా చూడాలని పేర్కొంది. సామూహిక ఖననాలు.. మరణించిన వారి గౌరవాన్ని దిగజార్చుతాయని అభిప్రాయపడింది.
ఇటీవల బిహార్, ఉత్తరప్రదేశ్లో గంగానదిలో కొవిడ్ రోగుల మృతదేహాలు తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మానవ హక్కుల సంఘం కేంద్ర హోం వ్యవహారాలు, ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఎన్హెచ్ఆర్సీ లేఖ రాసింది. ఈ విషయంలో కేంద్రం, ఆయా రాష్ట్రాలకు సైతం నోటీసులు జారీ చేసింది. అలాగే బిల్లులు చెల్లించలేదని మృతదేహాలను ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అట్టిపెట్టుకోకుండా చూడాలని, గుర్తు తెలియని మృతదేహాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించింది. గుర్తు తెలియని, చనిపోయిన వారి గురించి రాష్ట్ర అధికారులు తప్పక సమాచారాన్ని నిర్వహించాలని పేర్కొంది. అలాగే అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందికి అవసరమైన భద్రతా పరికరాలు, సౌకర్యాలు కల్పించాలని, అప్పుడే తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలరని తెలిపింది.
మతపరమైన ఆచారాలు పాటించేందుకు అనుమతి ఇవ్వాలని, కొవిడ్ మృతులకు చివరి ఖర్మలు చేయలేని స్థితిలో ఉన్నా, ముందుకు వారికి స్థానిక పరిపాలన సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకొని అంత్యక్రియలు పూర్తి చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి మహమ్మారి కారణంగా మే 13 నాటికి దేశంలో 2.62 లక్షలకుపైగా మరణించారు. కేంద్రం, రాష్ట్రాలు మరణాలకు సంబంధించి జిల్లా వారీగా డిజిటల్ డేటాను నిర్వహించాలని కోరింది. దీని కోసం డైనమిక్ వెబ్ పోర్టల్ను రూపొందించాలని.. కొవిడ్, నాన్ కొవిడ్ మరణాల డిజిటల్ నిర్ధారణ ఒకే సారి బ్యాంక్ ఖాతా, ఆధార్కార్డ్, బీమా మొదలైన అన్ని పత్రాలను నవీకరించాలని సూచించింది.