హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దేనికి ఎంత ఫీజు చెల్లించాలో నిర్ణయిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ 59, 60 జీవోలను విడుదల చేశారు. ప్రభుత్వం చేసిన ఈ సవరణలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ పక్క రాష్ట్రాలలో ఏవిధంగా ఉందో క్యాబినెట్ సబ్కమిటీ పరిశీలించింది. స్టాంప్ డ్యూటీ తమిళనాడు రాష్ట్రంలో 11%, కేరళలో 10%, పక్క రాష్ట్రమైన ఏపీలో 7.5% అమల్లో ఉన్నది. ఈ రాష్ట్రాలతో పరిశీలిస్తే తెలంగాణలో చాలా తక్కువ. స్టాంప్డ్యూటీని పెంచాల్సిన అవసరాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించి, ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దానిని పరిశీలించిన ప్రభుత్వం స్వల్పంగా స్టాంప్ డ్యూటీని 6 నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.