భోపాల్ : పెరుగుతున్న కరోనా కేసులతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఇండోర్, భోపాల్, జబల్పూర్ జిల్లాలో ఆదివారం లాక్డౌన్ అమలులో ఉండగా.. కొత్తగా మరో నాలుగు జిల్లాల్లో ఆదివారం లాక్డౌన్ విధించనున్నట్లు చెప్పింది. బేతుల్, చింద్వారా, రత్లం, ఖార్గోన్ జిల్లాల్లో ఆదివారం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించి, నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రం మొత్తం లాక్డౌన్ అమలు నిర్ణయాన్ని తోసిపుచ్చిన ఆయన.. రాబోయే పండుగ సీజన్లలో మరిన్ని ఆంక్షలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. లాక్డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై.. సోమవారం ఉదయం 6 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఆ జిల్లాల్లోని సినిమా హాళ్లు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని కూడా నిర్ణయించారు. అలాగే నిత్యం 20కిపైగా కేసులు నమోదవుతున్న నగరాల్లో, వారానికి సగటున 20 కన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్న జిల్లాల్లో వివాహ వేడుకలకు 50 మందికి, అంత్యక్రియాల్లో పాల్గొనేందుకు 20 మందికే అనుమతి ఇచ్చారు. అలాగే రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. కేవలం పార్సిల్స్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 1,712 కొత్త పాజిటివ్ కేసులు నమోదవగా.. ఏడు మరణాలు నమోదయ్యాయి.